-
Chivaraku Migiledi
₹300.00చివరకు మిగిలేది – ఏమిటి? అన్నదానికి వెంటనే దేని చివరకు? అన్న ప్రశ్న పుడుతుంది. ఆ వెంటనే మిగిలేది ఎవరికి? – అన్న జిజ్ఞాసా రాక తప్పదు. వ్యక్తికా – జీవితానికా – వ్యక్తులతోనూ వాళ్ళ మధ్య అనేకానేక ఉత్పతి, పునరుత్పతి సంబంధాలతోనూ ఆవిష్కారమైన సమాజానికా – అన్నదే అది. ఈ ప్రశ్న భావనామాయమైంది. దీనికి సమాధానం భౌతిక రూపంలో వెదకడం సులువేనా? అసలీ “మిగలటం” – అన్న సమస్య గురించి విశ్వనాథ ‘వేయిపడగల’ లో చర్చించాడు. అలాగే చలం తన “మ్యూజింగ్స్” లో కొంత ఆలోచన చేశాడు.
ఒకానొక విశ్వాసం మిగులుతుందని విశ్వనాథ అంటే, మిగులుతుందనుకోవటం భ్రమగా తేల్చేశాడు చలం. వీరి తాత్త్విక విశ్వాసాలకు సృజనాత్మకరూపం కల్పించి నవలగా రూపొందించిన ఘనత బుచ్చిబాబుది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కొత్త విలువల రూపుకడ్తున్నాయి. నిరాశా నిస్పృహల్లో మునిగిన సమాజాన్ని “లోచూపు” లో చూడటం అన్న వాస్తవికతలకు నవలారూపమే ఈ రచన. పురుషస్వామ్య సామాజిక భావాజాలం – అది సృష్టించిన పాత్రలు – వీటి ప్రవర్తన ఈ నవలలో బొమ్మకడుతుంది.
ప్రపంచంలోని వ్యక్తులే సాహిత్యంలో పాత్రలౌతారు. అలాగే బుచ్చిబాబు ఈ నవలలో సృష్టించిన పాత్రలు; ఆ కాలంలో తెలుగు దేశంలోని ఆధునిక సాహిత్య – సామాజిక – తాత్విక ధోరణుల ప్రతిబింబాలనిపిస్తాయి. రాధాకృష్ణన్ – రసెల్ – జిడ్డు కృష్ణమూర్తుల సమాహార తాత్వికతే బుచ్చిబాబు దార్శనికత్వం అనిపిస్తుంది. ఆధునిక తెలుగు నవలల్లో మంచివేవి? అని ఏ సాహిత్య విద్యార్థిని ప్రశ్నించినా ముందుగా చెప్పేది; తెలుగు కల్పనా సాహిత్యంలో చివరికంటా మిగిలేది ఈ “చివరకు మిగిలేది”.