-
Asurudu
₹450.00జయ పరాజయాల పురాణ గాధ
రామాయణ కధని ఇంతవరకూ లెక్కలేనన్ని సార్లు చెప్పటం జరిగింది. ఇది భగవంతుడి అవతారం అయిన రాముడి ఆసక్తికరమైన కధ. దుష్ట రాక్షసుడు రావణుడిని అతను సంహరిస్తాడు. ఇది ప్రతి భారతీయుడికీ సుపరిచితమే. చరిత్ర పుటలలో కూడా ఎప్పుడూ కధనం విజేతల పక్షానే ఉంటూ వస్తోంది. పరాజితుల గొంతు మౌనంగా ఉండి ఎవరికీ వినిపించదు. ఒకవేళ రావణుడూ, అతని ప్రజలూ ఈ కధని వేరేవిధంగా చెప్పాలనుకుంటే ఏమవుతుంది ?
రావణాయణ కధని ఎప్పుడూ ఎవరూ చెప్పలేదు.
‘అసరుడు’ పరాజితులైన అసురుల గాధ. 3000 సంవత్సరాలుగా వెలివేయబడ్డ పిడితులు ఎంతో ప్రేమగా కాపాడుకుంటూ వస్తున్న కధ ఇది. ఇంతవరకూ ఈ కధ చెప్పే సాహసం ఏ అసురుడూ చెయ్యలేదు. బహుశా పరాజితులైన వారూ, మరణించిన వారూ కధ చెప్పే సమయం ఆసన్నమైందేమో.
“కొన్ని వేల సంవత్సరాల వరకూ నన్ను ఒక దుర్మార్గుడిగా, ప్రతినాయకుడిలా చిత్రిస్తూ వచ్చారు. భారతదేశమంతటా నా మరణాన్ని పండగలా జరుపుకుంటారు. ఎందుకు? నా కుమార్తెకోసం దేవతలని ఎదిరించాననా? కులవ్యవస్థమీద ఆధారపడిన దేవతల పరిపాలన నా ప్రజలని కాడిలా అణచివెయ్యకుండా వారిని కాపాడాననా? మీరు విజేత కధ రామాయణం విన్నారు. నా కధ రావణాయణం కూడా వినండి. నా పేరు రావణుడు, నేను అసురుడిని, నాది పరాజితుడి కధ.”
“నేను ఉనికిలేని వాడిని – కళ్ళకి కనిపించను, అశక్తుడిని, లెక్కలోకి రానివాడిని, ఎన్నడూ, ఎవరూ నా గురించి ఎటువంటి గాధలూ రాయరు. నేను రావణుడి చేతిలోనూ, రాముడి చేతిలోనూ బాధలు అనుభవించాను – ఒకరు నాయకుడు, మరొకరు ప్రతినాయకుడు. ఆ పాత్రలని అటూ ఇటూ మార్చుకోవటం కూడా సాధ్యమే. గొప్ప వ్యక్తుల కధలు చెప్పేటప్పుడు, నా గొంతు మరీ బలహీనంగా ఉండి ఎవరికీ వినిపించకపోవచ్చు. అయినా ఒక్క క్షణం నాకోసం వెచ్చించి నా కధ కూడా వినండి. నా పేరు భద్రుడు, అసురుజాతి నాది, నాది ఓటమికీ గురైన వాడి కధ.”
ప్రాచీనకాలం నాటి అసుర సామ్రాజ్యం విచ్చిన్నమై పోయింది. ఎన్నో చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి దేవతల పాదాలకింద నలిగిపోసాగింది. అసహాయ స్థితిలో అసురులు తమ రక్షకుడూ, యువకుడూ అయిన రావణుడిని ఆశ్రయించారు. రావణుడి నియంతృత్వంలో తమకి మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో భద్రుడిలాంటి సామాన్య జనం ఆ యువనాయకుడిని అనుసరించాలని అనుకున్నారు. దృఢ నిశ్చయంతోనూ, విజయం సాధించాలన్న ఆకాంక్షతోనూ రావణడు విజయ పరంపరలతో తన ప్రజలని ముందుకీ తీసుకువెళ్లాడు. దేవతల రాజ్యాలన్నిటినీ హస్తగతం చేసుకుని, ఒక సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. రావణుడు అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ, అసురులలో పేదవారు తమ పరిస్థితిలో పెద్దమార్పేమీ జరగలేదని గ్రహించారు. సరిగ్గా ఆ సమయంలో రావణుడు ఒక్క దెబ్బతో ప్రపంచ చరిత్రనే మార్చివేశాడు.
-
Madhurantakam Rajaram Samagra Katha Sankalanam 5 Parts Of Set
₹3,000.00సర్కసు డేరా
ఏ పుట్టలో పాములుంటాయో, ఏ పుట్టలో ఈసిళ్ళుంటాయో యిర్లవాడికి తెలిసినట్టు మరొకరికి తెలియదు. భుజాన మోపెడు ఈతపుల్లలతోనూ, చేత నీళ్ళదుత్తతోనూ వాడొకడు మీకు పల్లెపట్టుల్లో ఎదురైతే, అతగా డక్క డెక్కడో పుట్టమూసి ఈసిళ్ళు పట్టబోతున్నాడన్న మాట! కీటక సంహారకాండలో నాందీ వాచకంగా అతడు పుట్టలో ముఖ్యరంధ్రాన్ని మాత్రం మినహాయించి, మిగిలిన వాటిని మూసేస్తాడు. ఆ తరువాత చిక్కగా నీళ్ళు చిలకరిస్తాడు. రంధ్రానికి చేరువగా ఒక దిగుడు అమర్చి అందులో దివ్వె వెలిగిస్తాడు. ఎండుమట్టి పైన చల్లటి నీళ్ళు పడ్డంతో నీటి ఆవిరి పైకెగిరి, పుట్టలోపలి కీటకాలకు వాన కురుస్తున్నట్టో లేక కురిసి వెలిసినట్టో భ్రమ కలుగుతుంది. బారులు బారులుగా అవి పైకొస్తాయి. వచ్చీరాగానే మృత్యుదేవత క్రూర దంష్ట్రలాంటి దీపశిఖ వాటిని ఆహ్వానిస్తుంది. అవి మొదట రెక్కలు రాల్చుకుంటాయి. తరువాత యిర్లవాడికి మరునాటి ఎరగా మారిపోతూ కుప్పగా కూలిపోతాయి.
పూర్తిగా కాకపోయినా, కొంతవరకూ ఈ ‘పుట్టమూత’తో పోలికలున్న సంఘటన ఒకటి పట్టణంలో జరిగింది.
గంటల కల్లా భోజనాలు ముగించి, జంబుచాపలు పరచుకోవడం తరువాయిగా దీపాలు ఆర్పేసి, వెచ్చగా వక్కాకు నములుతూ అరుగులపైన కూర్చున్న పల్లెటూళ్ళవాళ్ళకు ఆకాశంలో ఓ కాంతిపుంజం కనిపించింది. అది అచ్చంగా కాంతిపుంజం కూడా కాదు. భువినుండి దివికి ఏటవాలుగా ప్రసరిస్తున్న వెలుగుబాట. ‘ఎన్నడూ లేంది, ఏనాడూ వినంది, ఏమిటీ విడ్డూరం’ అని ఒక వైపున జానపదులు వెరగుపడిపోతున్నారు, మరొకవైపున ఆ వెలుగు వినువీధిలో నాలుగైదుసార్లు వలయాలు తిరిగి, అంతటితో తన పని తీరిపోయినట్టు అంతర్ధానమైపోయింది.
మెరుపూ, ఉరుమూ ఒకేసారి ఉద్భవించినప్పటికీ శబ్దవేగం కన్నా కాంతివేగం ఎక్కువ గనుక మెరుపు ముందుగా కనిపిస్తుందని చెబుతుంది విజ్ఞాన శాస్త్రం. ఇక్కడగూడా సరిగ్గా అలాగే జరిగింది. రాత్రి ఎనిమిది గంటలు, ఆ ప్రాంతంలో వెలుగు కనిపించింది……………